ఒక ట్రావెలాగుడు - నాల్గవ టపా

ఆ కథలో ఒక రాజభక్తుడిని రాజద్రోహిగా పొరపాటుబడి శిక్ష విధిస్తారు ప్రభువులు. ఒక దబ్బనపు మొనపైన ఒక ఘడియ సేపు వెల్లకిలా పడుకోబెట్ట వలసిందిగా శిక్ష. అప్పుడు పక్కనే వున్న మంత్రి కలగజేసుకొని ప్రభువులతో - మహారాజా, ఈ రాజద్రోహిని ఒకటి కాదు

పదివేల దబ్బనాల మీద పడుకోబెట్టాలి, అంటాడు తెలివిగా. రాజు అలాగే నంటాడు. పదివేల దబ్బనాలు నిలువుగా నాటించి వాటిపైన పడుకోబెట్టించి రక్షించుకొంటాడు. ఇందులోని సెన్సు, సైన్సు మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనిపిస్తే భీష్మపితామహుణ్ణి అడగాలి ఈ ఛాయాచిత్రానికి 'కంపశయ్య' అనే పేరెలావుందో. ఆయన కూడా 'అచ్చు' ఇలాంటి దాని పైనే శయనించాడట కదా.

ఆ సాయంత్రానికి ఛీసోస్ బేసిన్‌ చేరుకున్నాం. ఆరోజు పెద్దగా ఏమీ చెయ్యకుండానే సాయంత్రమైపోయిందని నాకు నిరాశగా అనిపించింది. అసలు ఉదయాన అందరూ తయారై తెమిలేటప్పటికే మధ్యాహ్నమైనట్లయింది. అయితే అక్కడొక అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడబోతున్న సంగతి నాకు తెలియదు. ప్రకృతి ఛీసోస్ పర్వతాలతో ఒక చిత్రమైన కిటికీ లాంటి ఏర్పాటు చేసినట్లుంది.

ఆ కిటికీలో నుండి సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరిస్తూ ఒకో పర్వతాన్ని నిముషానికొక రంగులో వెలిగిస్తూ దాదాపు ఒక చుట్టు తిరిగినట్లు అనిపిస్తాయి.

పై బొమ్మలో కుడివైపు నల్లగా కనిపిస్తున్న పర్వతభాగం ముందుగా వెలిగింది. తరువాత దాని పక్కనున్న ఒక కొండ ముక్క వెలిగింది. దానిమీదకు నా కెమెరాను జూమ్మనిపించాను. ఆ తరువాత దాని పక్కనున్న కొండ.

నిలువైన రాతి తొర్రలతో ఆ కొండ కాస్త ప్రత్యేకంగా కనిపించింది. మెల్లగా దాని పక్కనున్న కొండపై పెద్ద బండరాయి వంటి శిఖరంపై కిరణాలు పడి మెరిపించాయి. కిటికీకి సరిగ్గా ఎదురుగా వున్న కొండ అది.

పై బొమ్మలో కనిపిస్తున్న మూడు కట్టడాలు కుడి నుండి ఎడమకు, దగ్గరనుంచి దూరానికీ వరుసగా - కాస్త ప్రత్యేకమైన వస్తువులు దొరికే అంగడి, ఛీసోస్ సందర్శకుల కేంద్రం, పూటకూళ్లయిల్లు. ఏ విపత్తు వచ్చినా తలదాచుకోవడానికి ఇవి తప్ప ఇంకేమీ లేవక్కడ. ఇక్కడి అంగడిలో కొన్న ఒక పలుచని పాలిథీన్ చొక్కా వానకు తడవకుండా కాపాడుకోవడానికీ, ఇంకొకటి అలాంటిదే ఒక అత్యవసర సంచీ - హోరువానలో ఒళ్లంతా సంచీలో దాచి కొద్దిసేపు ఎక్కడైనా ముడుక్కోవడానికి. సూర్యభగవానుడు కిందకు జారేకొద్దీ పర్వతాలతో పాటు వాటిపైని మేఘాలు కూడా రంగులద్దుకోవడం మొదలుపెట్టాయి.



అహో! సూర్యాస్తమయ ఇంద్రజాలం!! అని అబ్బురపడి, బసకు చేరే ఆలోచన చేస్తూ వెనుదిరిగి చూస్తే, 'నీ వెన్ను తట్టి పిలిచింది నేనేనోయ్... ఓ... రామనాధా' అంటూ భట్టి విక్రమార్క సినిమాలోని పాటకు పేరడీ పాడుతూ కొండనెక్కి వస్తున్నాడు వెన్నెలరాజు. ఇంతదాక ఇంద్రజాలం, ఇప్పుడీ చంద్రజాలం. జాలములలో చిక్కడం కూడా ఒక అదృష్టం. కొండలపైన సూర్యుని వెలుగు ఇంకా పోనే లేదు. చంద్రుణ్ణి కిందికి చూడనివ్వకుండా మేఘాలు ఆవరిస్తున్నాయి.

ఆ వెలుగు పూర్తిగా తగ్గకముందే మా బసకు చేరి గుడారాలు వేసేశాం. అక్కడెంత చలిగా వుందో అంతవరకూ గమనించలేదు, లేదా అప్పుడే పెరిగిందోగానీ తలలు దిమ్మెక్కినట్లు అనిపించాయి మా నలుగురికీ. వెంటనే నీళ్లు వేడి చేసి, టీ తాగి, ఈ సారి నిజంగానే ఉప్పువేసిన టొమాటో బజ్జీతో కడుపునిండా టోటిల్లా/చపాతీలు లాగించి, గుడారాల్లో చేరి నిద్దురసంచుల్లోకి దూరగానే చీకటితోపాటు నిద్రకూడా కమ్ముకొచ్చేసింది.

తెలతెలవారుతుండగా మెలకువొచ్చింది. గురకలు వినబడుతున్నాయి. శబ్దం చేయకుండా జాగ్రత్తపడుతూ, కుబుసం విడిచే పాములా మెల్లగా నిద్దురసంచీలోంచి బయటపడి, గుడారం వెలుపలికొచ్చాను. ఎదురుగా కాస-గ్రాండె శిఖరం. ఆకాశమింకా మేఘావృతంగానే వుంది. రాత్రి సన్నగా చినుకులు పడినట్లున్నాయి. అది మంచు కావచ్చు కూడా. మంచుకూ వానకూ తేడా తెలియనీయని చలి.
తూర్పుదిక్కున మేఘాలు భానుమూర్తి ఆగమనాన్ని సూచిస్తూ బహుపరాక్కులు చెబుతున్నాయి. ఈ రోజు దక్షిణపు అంచు (South Rim) పైకి ఎక్కితీరాల్సిందే - అనుకున్నాను. అంత గట్టిగా అనుకోవడం ఎందుకంటే మా నలుగురిలో ఇద్దరు మనుషులు "మా వల్లకాద"నేశారు. అని ఊరుకోక, "మీరూ మాతోనే వుండండ"ని మొన్నటినుంచీ చెప్పకనే చెబుతున్నారు. పెద్దమలుపు (బిగ్‌బెండ్) దక్షిణభాగాన గల ఎత్తైన పర్వతపు అంచు ఈ సౌత్ రిమ్. ఈ అంచు నుండి భూమి బ్రహ్మాండంగా పల్లమౌతూ అవుతూ రియోగ్రాండె (Rio-bravo) వరకూ వచ్చి ఆగుతుందనీ ఆ దృశ్యం చూసితీరాల్సినదేననీ వినియున్నాను.

తూరుపు దిక్కున మేఘాలు నిజంగా బహుపరాక్కులే చెబుతున్నాయి. కానీ నేను మాత్రం పరాకుగానే వున్నాను. ఆ కొండల మధ్యలో అతి నెమ్మదిగా దూకుతున్న జలపాతం వంటి జలదపాతం. కమనీయమైన దృశ్యం. చూడండంటూ మిగతా ముగ్గురినీ నిద్ర లేపాను. కానీ ఒక్కరే లేచి బయటకొచ్చారు. ఆ వచ్చిన మానవుడే నాతోపాటు దక్షిణపు అంచుకు వస్తానంటున్న ఆశాదీపం.


మిగతా ఇద్దరూ లేచారు. కాఫీ ఫలహారాలవీ కానిస్తున్నాం. చూస్తూ చూస్తూనే ఆ జలదాల మాల మాదాకా వచ్చేసింది. మమ్మల్ని కప్పేసింది. సూర్యుడికీ మాకూ మధ్యన అడ్డుగా నిలిచింది. మేఘాలను మనవాళ్లు మబ్బులు అని ఎందుకన్నారో తెలియజేసిందా వాతావరణం.

అంతలో మా సాయి ఒక కబురు తెచ్చాడు - "ఈ రోజు మంచు పడవచ్చు అనుకొంటున్నారు కొందరు జనాలు". మధ్యాహ్నం అవుతూ వుంటే మంచు పడటమేమిటి! అనుకున్నాను. "ఈ పరిస్థితిలో సౌత్‌రిమ్ చేరడం ప్రమాదకరం, ఆలోచించండి" అన్నాడు పితామహ.

"కరటక-దమనకులు!" మనసులోనే అనుకున్నాను నేను. అనుభవం లేకుండా ఒక్కడినే వెళ్లడం తెలివితక్కువౌతుంది. "సౌత్‌రిమ్ముకు రాలేముకానీ, ఎమొరీ పీక్‌కు అయితే మేము కూడా వస్తాం" అన్నాడు పితామహ. కొద్దిగా మధనపడి, చివరకు ఆశాదీపంకూడా అటే మొగ్గు చూపడంతో సరేనన్నాను.

ఎమొరీ శిఖరపు ప్రత్యేకత ఏమిటంటే - పెద్దమలుపులో అది అత్యంత ఎత్తైన పర్వతశిఖరం. చీసోస్ బేసిన్ నుండి నాలుగున్నర మైళ్లు నడిస్తే పర్వత శిఖరాన్ని చేరుకోగలం. తీరా ఇక మొదలెడదాం అనుకునేసరికి మెల్లగా చల్లగా తుంపర్లు. అవి వానతుంపరలో లేక మంచుతుంపరలో తెలియదు. పది మీటర్లకు ఆవలనున్నదేదీ కనబడటం లేదు. ఆ ఇద్దరూ "మంచిది కాదు, మనం వెళ్లొద్దు" అన్నారు.

సుమంగళి సినిమాలో నాగేశ్వర్రావులాగా '.. అని తలచి తలచి నే నిన్ని నాళ్లుగా తపసు చేసినది ఇందులకా'అని నిరాశచెందాను. వెంటనే పక్కనున్న సందర్శకుల కేంద్రంలోకి గబగబా నడిచివెళ్లాను. అక్కడి సమాచార కిటికీ దగ్గర ముదుసలితనం తొంగిచూస్తున్న ఒక ఆడ, ఒక మగ స్వచ్చంద కార్యకర్తలున్నారు. వాళ్లనడిగాను - "ఈ వాతావరణంలో వద్దని నా మిత్రులు వారిస్తున్నా ఎమొరీ పీక్ వెళ్లి రావాలనుకుంటున్నాను, నాది మూర్ఖత్వమా?"

పెద్దయ్య నవ్వి, "మంచు కురవవచ్చు, మధ్యాహ్నం వాన కూడా పడవచ్చు. కానీ ఎమొరీ ఎక్కుతున్న మనుషులేమో ఉన్నారు. నన్నడిగితే వెళ్లిరావచ్చు. జాగ్రత్త." అన్నాడు. ఆయన వాలకం పెద్దమ్మకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. అంతలో నా మిత్రులు వచ్చి అదే ప్రశ్న వేశారు. ఈ మారు పెద్దమ్మ చెప్పింది ... (సశేషం)

కామెంట్‌లు

ramya చెప్పారు…
కమనీయమైన దృశ్యాలలోకి తీసుకుని వెళ్లారు.
చలి చలి నేను ఓ టీ తాగి తరువాతి టపాలోకి వెడతాను.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు